TRS: టీఆర్ఎస్ లో చేరిన జలగం ప్రసాదరావు

  • ‘జలగం’కు టీఆర్ఎస్ కండువా కప్పి సాదర ఆహ్వానం
  • అన్ని వర్గాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది
  • మహాకూటమి అధికారంలోకొస్తే, మనకు నీళ్లు రావు: జలగం

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు టీఆర్ఎస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా జలగం ప్రసాదరావు మాట్లాడుతూ, అన్ని వర్గాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పొరపాటున మహాకూటమి అధికారంలోకొస్తే, మనకు నీళ్లు రావని, నాగార్జున సాగర్ గేట్లను చంద్రబాబు మూసేస్తాడని, తెలంగాణలో చంద్రబాబు చెబితే సీట్లిచ్చే దుస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని విమర్శించారు.
 
కాగా, ‘కాంగ్రెస్’ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జలగం ప్రసాదరావును పార్టీ నుంచి గతంలో సస్పెండ్ చేశారు. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ కాంగ్రెస్ పార్టీ నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది.

More Telugu News