pawan kalyan: పవన్ వెనక బీజేపీ ఉంది.. మాయావతిని కలవడానికి వెళ్లినప్పుడు వాహనాన్ని సమకూర్చింది బీజేపీనే!: బీద రవిచంద్ర

  • వైసీపీ, జనసేనలతో బీజేపీ లోపాయికారీ ఒప్పందం
  • బీజేపీ కుట్రలను గమనించే బీజేపీ వ్యతిరేక పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు
  • ఐటీ దాడుల వల్ల నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది

ఏపీలో వైసీపీ, జనసేనలతో బీజేపీ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని, తెలంగాణలో టీడీపీని దూరం చేసి చీకటి రాజకీయాలు నడుపుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మండిపడ్డారు. ఏపీని అణగదొక్కేందుకు విశ్వప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇటీవల బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవడానికి పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు... ఆయనకు వాహనం సమకూర్చింది బీజేపీనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ కుట్రలను గమనించే... జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ చంద్రబాబు ఏకం చేస్తున్నారని రవిచంద్ర చెప్పారు. దేశంలోని రాజకీయ శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి, మోదీ వెన్నులో చంద్రబాబు వణుకు పుట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తనపై ఐటీ దాడులు చేయించినా, తాను భయపడనని చెప్పారు. ఐటీ దాడుల వల్ల తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని అన్నారు. తనపై అసత్య కథనాలను ప్రసారం చేసిన ఓ పత్రిక, ఛానెల్ పై రూ. 50 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.

More Telugu News