GVL: చంద్రబాబును కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టి మాయావతి మాట్లాడారు: జీవీఎల్ ఎద్దేవా

  • అఖిలేష్ లాంటి బచ్చాలతో బీజేపీని ఏమీ చేయలేరు
  • 2019లో చంద్రబాబు గల్లంతు ఖాయం
  • 2019లో బీజేపీ గెలుపుపై జీవీఎల్ ధీమా

రాజకీయ ఎత్తుగడలతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహారావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవముందని, మోదీ కన్నా తానే సీనియర్ అంటున్న బాబు.. అఖిలేష్ లాంటి బచ్చాలతో కలిసి బీజేపీని ఏం చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, కానీ అదే పార్టీతో కలిసి వెళ్లడమంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలుస్తున్నారని, 2019లో గల్లంతు కావడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పారు.

చంద్రబాబును మాయావతి కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టి మాట్లాడారని, మరోసారి వెళ్తే కింద కూర్చోబెట్టి మాట్లాడతారేమోనని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన పార్టీలను కలుపుకుని లూజర్స్ క్లబ్ పెట్టుకుంటున్నారని, దాని వల్ల బీజేపీకి లాభం కానీ.. నష్టం కానీ లేవన్నారు. శరద్‌యాదవ్ ఏ పార్టీలో ఉన్నారని బాబు కలుస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, 2014లో 282 సీట్లుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2019లో కూడా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News