Uttam Kumar Reddy: 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ.. టీడీపీకి 14 సీట్లు: ఉత్తమ్

  • టీజేఎస్, సీపీఐతో కొనసాగుతున్న చర్చలు
  • ఈ నెల 8 లేదా 9న ప్రకటన
  • ఢిల్లీలో వెల్లడించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. టీడీపీతో 14 సీట్లకు సర్దుబాటు కుదిరిందని స్ఫష్టం చేశారు. టీజేఎస్, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. అభ్యర్థుల జాబితాను ఈ నెల 8 లేదా 9న ప్రకటిస్తామని తెలిపారు.  

ఇప్పటివరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని, మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో ఉంటుందని స్పష్టతనిచ్చారు. మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలా..? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ తెలిపారు.

కూటమిలోని పార్టీలతో చర్చలు పూర్తయ్యాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఈనెల 8న మరోసారి సమావేశమై అభ్యర్థుల తుది జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశముందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా వెల్లడించారు.

More Telugu News