Hyderabad: ప్రియురాలి కోసం భార్య పరువు తీసిన ప్రబుద్ధుడు!

  • ఆస్ట్రేలియాలో చదివి వ్యాపారం చేస్తున్న వివాహితుడు
  • ఓ మీటింగ్ లో పరిచయమైన విడాకులు పొందిన యువతి
  • ఆమె కోసం భార్యను వేధించి అరెస్టయిన వ్యక్తి

ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివి, వివాహమైన ఓ వ్యక్తి, ప్రియురాలి కోసం భార్య పరువు తీశాడు. ఆమె నగ్నంగా ఉన్న చిత్రాలను వైరల్ చేస్తూ, దిగజారుడు రాతలు రాశాడు. ఈ పైత్యానికి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, వనస్థలిపురం, ఎస్కేడీ నగర్‌ కు చెందిన ఆలపాటి తులసీదాస్‌ ఆస్ట్రేలియాలో బీబీఏ చదివి వచ్చాడు. హైదరాబాద్‌ లో వ్యాపారం చేస్తూ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.

గత ఏడాది బంజారాహిల్స్‌ లో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్ మీటింగ్ లో మౌనిక అనే యువతి, తులసీదాస్ కు పరిచయం కాగా, వారి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. అప్పటికే మోనిక తన భర్త ఈశ్వర్ నుంచి విడాకులు తీసుకుని ఉంది. వీరిద్దరి గురించి తెలుసుకున్న తులసీదాస్ భార్య ఈ సంవత్సరం మేలో పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆ సమయంలో తులసీదాస్ అరెస్టై, ఆపై బెయిల్ మీద బయటకు వచ్చాడు.

ఇక, భార్యపై కక్ష పెంచుకున్న అతను, విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ, తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తాను మోనికాతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను తీసి పంపడం ప్రారంభించాడు. తన భార్య ప్రవర్తనపై అసభ్య పదజాలంతో వాడుతూ పోస్టులు పెట్టాడు. ఈ వేధింపులు తీవ్రం కావడంతో ఆమె రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. విచారించిన పోలీసులు, వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

More Telugu News