ys jagan: జగన్ పిటిషన్ లో చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం హాస్యాస్పదం: మంత్రి కొల్లు రవీంద్ర

  • జగన్ పై దాడి చేసింది వైసీపీ కార్యకర్త
  • అయినప్పటికీ రాద్ధాంతం చేస్తున్నారు
  • జగన్ కు ఎవరిపై నమ్మకం ఉంది? కేంద్రప్రభుత్వంపైనా?

తనపై జరిగిన దాడి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కుట్ర కోణం బయటపడేలా విచారణ జరగడం లేదని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ లో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడంపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం హాస్యాస్పదమని అన్నారు. జగన్ పై దాడి చేసింది వైసీపీ కార్యకర్త అని తెలిసీ రాద్ధాంతం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు చిన్నగాయమే అయిందని వైద్యులు నిర్ధారించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. నేర చరిత్ర కలిగిన పార్టీ వైసీపీ అని, మోదీతో కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. ఏపీ పోలీసులపై, ప్రభుత్వ ఆసుపత్రులపైనా నమ్మకం లేదని జగన్ చెబుతున్నారని, మరి, జగన్ కు ఎవరిపై నమ్మకం ఉంది? కేంద్ర ప్రభుత్వం పైనా? అని ప్రశ్నించారు .

More Telugu News