Revanth Reddy: కాంగ్రెస్‌ నేతలను వేధించే అధికారుల కోసం ప్రత్యేక డైరీ పెట్టాం: రేవంత్ రెడ్డి

  • రాష్ట్రంలో ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాప్
  • ఆంధ్రా గుత్తేదారులకు పనులు ఇచ్చి సన్మానాలు
  • ఎన్నికల కమిషనర్‌పై నమ్మకం ఉంది

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని, అందుకే పదవీ విరమణ చేసిన వేణుగోపాలరావును మళ్లీ నియమించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీజీపీ నేతృత్వంలో కొంతమంది పోలీసులు కేసీఆర్‌కు ప్రైవేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పాలన నిజాం పాలనను తలపిస్తోందని, ప్రభుత్వ అధికారులు చట్ట పరిధిలో ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని, టీఆర్‌ఎస్‌ నేతల ఆదేశాలను అధికారులు పట్టించుకోవద్దని ఆయన కోరారు. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవారు, కాంగ్రెస్‌ నేతలను వేధించే వారి కోసం ప్రత్యేక డైరీ పెట్టామని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.

 ప్రగతి భవన్‌, మంత్రుల నివాస ప్రాంగణంలో తెరాస సమావేశాలు జరుగుతున్నాయని, అక్కడి నుంచే‌ కోట్ల రూపాయల డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. తెరాస ముఖ్య నేతలు, వారి మిత్రుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెడితే కోట్ల రూపాయలు బయటపడతాయన్నారు.

చంద్రబాబు చెడ్డవారైతే కేసీఆర్‌ అమరావతికి వెళ్లి మోకరిల్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ వేరైతే యాగానికి చంద్రబాబు, వెంకయ్యనాయుడిని ఎందుకు ఆహ్వానించారో కేసీఆర్‌ కారణం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రా గుత్తేదారులకు పనులు ఇచ్చి సన్మానాలు చేస్తున్న కేసీఆర్.. అమరవీరుల కుటుంబాలకు కనీసం బుక్క బువ్వ కూడా పెట్టడంలేదని విమర్శించారు.  టీఆర్‌ఎస్‌ మీడియాతో ఇతర మీడియా సంస్థలు కూడా తెరాసకే 90 శాతం సమయం కేటాయిస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

టీఆర్‌ఎస్‌ సొంత మీడియా, వారి బంధువుల మీడియా సంస్థలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. ఆ మీడియా సంస్థలు ఇతర పార్టీలపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయన్నారు. అందువల్ల ఆయా సంస్థలను ప్రచార సాధనాలుగా పరిగణించకుండా నిషేధించాలని ఈసీని కోరానని తెలిపారు. ఆయా మీడియా సంస్థలను నిర్వహించే వారిని సంఘ విద్రోహ శక్తులుగా గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఎన్నికల కోడ్‌కు సంబంధించి ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇక్కడి అధికారులు స్పందించట్లేదన్నారు. తమ ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజత్‌కుమార్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News