Indonesia: విమానంలోని అందరూ చనిపోయి ఉండొచ్చు!: ఇండోనేషియా అధికారులు

  • అనుమానం వ్యక్తం చేసిన రెస్క్యూ అధికారులు
  • ప్రాణాలతో ఉన్నారనేందుకు ఆనవాళ్లు లభించలేదు
  • సముద్రంలో కూలిన ఇండోనేషియా విమానం

సముద్రంలో కూలిన ఇండోనేషియాకు చెందిన విమానయాన సంస్థ ‘లయన్ ఎయిర్‌ఫ్లైట్‌’ విమానంలోని మొత్తం 189 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నామని గాలింపు, రెస్క్యూ చేపడుతున్న జాతీయ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. విమానం కూలిన ప్రాంతంలో కొందరి మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే ప్రయాణికుల లగేజీ బ్యాగులు కూడా తేలియాడుతున్నాయి. ప్రాణాలతో ఎవరైనా బయటపడ్డారా? లేదా? అనే విషయం తెలియరాలేదని, ఒక్కరైనా ప్రాణాలతో ఉన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు.

ఇదిలావుండగా, ఇండోనేషియాలోని జకార్తా నుంచి జంగ్‌కల్‌ పినాంగ్‌కు ఈ విమానం బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన 13 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్ అధికారులతో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. సంభాషణలో భాగంగా చివరి సారిగా వెనక్కు వచ్చేయాలని పైలెట్లకు సూచించామని, అయితే ఆ వెంటనే విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. 

More Telugu News