shivaji: పని లేని వ్యక్తులే రాజకీయాల్లోకి వస్తారా? అదే నిజమైతే మీరంతా ఏమిటి?: శివాజీ

  • జడ్జి లోయాలాంటి వారికే న్యాయం జరగలేదు
  • కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న నేతలు సిగ్గు పడాలి
  • నాతో పెట్టుకుంటే ప్రజలతో పెట్టుకున్నట్టే

మన దేశంలో న్యాయమూర్తి లోయాలాంటి వారికే న్యాయం జరగలేదని... దీనికి తాను సిగ్గుపడుతున్నానని ప్రత్యేక హోదా సాధన సమితి నేత, సినీ నటుడు శివాజీ అన్నారు. గతంలో మన నేతలు ఎంతో విలువైన రాజకీయాలు చేశారని... ఇప్పుడు సామ్రాజ్య కాంక్షతో కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న నేతలు సిగ్గుపడాలని చెప్పారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని... కానీ, రాష్ట్రంపై, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై దాడి చేస్తే మాత్రం అడుగడుగునా అడ్డుపడతానని తెలిపారు. చంద్రబాబు స్థానంలో జగన్ ఉన్నా, పవన్ కల్యాణ్ ఉన్నా తాను ఇలాగే మాట్లాడతానని అన్నారు.

తనకు సినిమాలు లేవంటూ కొందరు విమర్శిస్తున్నారని... తన వ్యక్తిగత జీవితం సమాజానికి అవసరం లేదని శివాజీ అన్నారు. పని లేని వ్యక్తులే రాజకీయాల్లోకి వస్తారా? అదే నిజమైతే మీరంతా ఏమిటని తనను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. శివాజీతో పెట్టుకుంటే ప్రజలతో పెట్టుకున్నట్టే అని అన్నారు. తనకు ప్రత్యేక హోదానే అజెండా అని చెప్పారు. ఆపరేషన్ గరుడకు సంబంధించిన వివరాలను తనకు ఇచ్చిన వ్యక్తి పేరును తాను వెల్లడించలేనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. 

More Telugu News