Union Minister: ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్రమంత్రి.. జనం లేకపోవడంతో అలక!

  • ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి మంత్రి
  • జనాలు లేకపోవడంతో అలక
  • అష్టకష్టాలు పడి 50 మందిని తీసుకొచ్చిన అధికారులు

కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అలిగారు. తాను ప్రారంభోత్సవానికి వస్తే జనాలు రాలేదంటూ అలిగి కూర్చున్నారు. దీంతో విస్తుపోయిన అధికారులు అతి కష్టం మీద మరికొందరిని తీసుకురావడంతో ప్రారంభోత్సవం చేసిన మంత్రి కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో జరిగిందీ ఘటన.

ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ కేవలం 20 మంది మాత్రమే ఉండడంతో మంత్రి గారికి చిర్రెత్తుకొచ్చింది. ఓ కేంద్రమంత్రి ప్రారంభోత్సవానికి వస్తే వచ్చేది ఇంతమందేనా? అంటూ అలిగారు. ప్రజలందరూ ఏమయ్యారని, అధికారులు మాత్రమే వస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొనేది లేదంటూ తెగేసి చెప్పారు. దీంతో నిర్ఘాంతపోయిన అధికారులు గ్రామంలోకి వెళ్లి అతి కష్టం మీద ఓ 50 మందిని పిలుచుకొచ్చారు. దీంతో అలక వీడిన మంత్రి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.  

More Telugu News