Chandrababu: చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు: ఎమ్మెల్సీ కర్నె

  • జగన్ ని కేసీఆర్ పరామర్శిస్తే తత్తరపాటు ఎందుకు?
  • ఈ దాడిని ఖండిస్తే మోదీతో సంబంధం అంటగడతారా? 
  • సాటి మనుషులుగా కేసీఆర్, కేటీఆర్, కవిత స్పందించారు    

చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని, ప్రతిదీ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని, బాబు మనిషా? మర మనిషా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విశాఖలో జగన్ పై దాడి జరిగితే సాటి మనుషులుగా కేసీఆర్, కేటీఆర్, కవిత స్పందించారని అన్నారు. జగన్ ని కేసీఆర్ పరామర్శిస్తే తత్తరపాటు ఎందుకు? జగన్ పై దాడిని లోకేశ్ ఖండించలేదా? అని ప్రశ్నించారు. ఈ దాడిని ఖండించిన కేసీఆర్ కు మోదీతో సంబంధం అంటగడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో విభేదాలుంటే ఉండొచ్చు అయినా, మానవ సంబంధాలు అనేవి ఉంటాయని అన్నారు.

తెలంగాణకు బద్ధ విరోధి అయిన చంద్రబాబుపై గతంలో అలిపిరిలో దాడి జరిగినప్పుడు మేము ఖండించలేదా? టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఇటీవల మృతి చెందినప్పుడు, ఏపీలో గతంలో హుద్ హుద్ తుపాన్ వచ్చినప్పుడు మేము స్పందించలేదా? అని ప్రశ్నించారు.

More Telugu News