Andhra Pradesh: బీజేపీ అభ్యర్థికి నాపై డిపాజిట్ దక్కినా విజయవాడ వదిలి వెళ్లిపోతా!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • జీవీఎల్ అక్రమంగా రూ.200 కోట్లు సంపాదించారు
  • అగ్రిగోల్డ్ భూముల దోపిడీకి అమిత్ షా కుట్ర
  • బీజేపీ గుంట నక్కల పార్టీ, టీడీపీ సింహాల పార్టీ

భద్రత లేకుండా ప్రజల్లోకి వస్తే బీజేపీ నేత, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఆంధ్రా ప్రజలు బుద్ధి చెబుతారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు. జీవీఎల్ అక్రమంగా రూ.200 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల ముసుగులో రాష్ట్ర ద్రోహుల ముఠా హడావుడి చేస్తోందని విమర్శించారు. ఈరోజు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

అగ్రిగోల్డ్ ఆస్తులను బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడికి కట్టబెట్టేందుకు బీజేపీ నేతలు ప్లాన్ వేశారని ఆయన తెలిపారు. షా ఆదేశాలతోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ రంగంలోకి దిగి రాష్ట్రంలో ఆందోళనలు చేయిస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే బీజేపీ అభ్యర్థిని తనపై పోటీకి నిలపాలని రామ్ మాధవ్ కు సవాలు విసిరారు.

తనపై బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కినా విజయవాడ వదిలివెళ్లిపోతానని బుద్ధా వెంకన్న ప్రకటించారు. టీడీపీ సింహాల పార్టీ అయితే బీజేపీ గుంటనక్కల పార్టీ అని ఎద్దేవా చేశారు. జీవీఎల్ స్థాయికి తాను చాలనీ, దమ్ముంటే తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఏకంగా సీబీఐకే అవినీతి చీడ పట్టించిన చరిత్ర ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాదని విమర్శించారు.

More Telugu News