gandhi: ఆజాద్ హింద్ ఫౌజ్ టోపీని ధరించిన మోదీ.. నెహ్రూ, గాంధీ కుటుంబాలపై విమర్శలు

  • స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో నేతలు కీలకపాత్ర పోషించారు
  • అయినా గాంధీ, నెహ్రూ కుటుంబాలకే పేరు దక్కేలా ప్రయత్నాలు కొనసాగాయి
  • ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసింది

దేశానికి ఎందరో మహనీయులు అసమాన సేవలు అందించారని... అయినా వారందరినీ పక్కనపెట్టి నెహ్రూ, గాంధీల కుటుంబాలనే తెరపైకి తెచ్చారని ప్రధాని మోదీ విమర్శించారు. బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో నాయకులు స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. అయినప్పటికీ గాంధీ, నెహ్రూల కుటుంబాలకే పేరు దక్కేలా ప్రయత్నాలు కొనసాగాయని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసిందని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ సర్కార్ ను ప్రకటించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎర్రకోటలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ టోపీని ధరించారు.

అనంతరం మోదీ మాట్లాడుతూ, దేశానికి సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను కొనియాడారు. ఎందరో నేతల త్యాగాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామని... స్వరాజ్యాన్ని సురాజ్యంగా మలుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. రక్షణ, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు నాలుగేళ్లుగా చర్యలు చేపట్టామని తెలిపారు. 

More Telugu News