Tamilnadu: యువతిపై అత్యాచారయత్నం.. మనస్తాపంతో నిప్పంటించుకున్న బాధితురాలు!

  • తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో ఘటన
  • టీవీ రిపేర్ చేయాలని కోరిన యువతి
  • లైంగిక దాడికి యత్నించిన సమీప బంధువు

టీవీ రిపేర్ చేస్తానంటూ ఇంట్లోకి వచ్చిన బంధువైన యువకుడు ఓ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. అక్కడితో ఆగకుండా ఈ విషయాన్ని బయట ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన బాధిత యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని వాళపళంజికి చెందిన ఓ యువతి(22) ఇంట్లో ఉన్న టీవీ సరిగ్గా రావడం లేదని, బంధువైన రాజేశ్ అనే యువకుడిని పిలిచి సరిచేయాలని కోరింది. అయితే టీవీ మరమ్మతు చేస్తానంటూ ఇంటిలోకి వచ్చిన సదరు ప్రబుద్ధుడు యువతిపై లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడు. దీంతో యువతి గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.

అనంతరం మరోసారి ఇంటికి వచ్చి‘ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తా’ అని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి లోనైన బాలిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News