Telangana: కాంగ్రెస్ కార్యకర్తను అయినందుకు గర్విస్తున్నా.. ఆయన జెడ్ కేటగిరీలో పుట్టిన బిడ్డ!: బండ్ల గణేశ్

  • దేశానికి కాంగ్రెస్ నిస్వార్థ సేవ చేసింది
  • త్వరలోనే పార్టీకి మంచిరోజులు
  • భైంసా బహిరంగ సభలో మాట్లాడిన గణేశ్

నిస్వార్థంగా దేశానికి సేవ చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తను అయినందుకు గర్విస్తున్నానని ఆ పార్టీ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. సోనియా గాంధీ ఎన్నడూ పదవీ కాంక్షతో రాజకీయాల్లో రాలేదని వ్యాఖ్యానించారు. ఈరోజు భైంసాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడారు.

రాహుల్ గాంధీ జెడ్ కేటగిరీలో పుట్టిన బిడ్డనీ, అయినా ఆయన ఏనాడూ హద్దుమీరి ప్రవర్తించలేదని బండ్ల గణేశ్ తెలిపారు. ఆయన నేల మీదే బతికారనీ, నేల విడిచి సాము చేయలేదని అన్నారు. గాంధీ కుటుంబం ఎప్పుడూ 'నా దేశం, నా ప్రజలు' అనే బ్రతికారనీ, అహంకారంతో ఎన్నడూ ప్రవర్తించలేదని వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు. అనంతరం జై రాహుల్ గాంధీ, జైజై సోనియమ్మ, జై కాంగ్రెస్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

More Telugu News