nandiswar goud: ఆకాశమంత ఎత్తున్న చంద్రబాబుపై ఉమ్మేస్తే... ఎవరి మీద పడుతుందో అర్థం చేసుకోండి: నందీశ్వర్ గౌడ్

  • పటాన్ చెరులో మహాకూటమి అభ్యర్థిని 25 వేలకు పైగా మెజార్టీతో గెలిపిస్తా
  • మహిపాల్ రెడ్డి ఒక రౌడీ షీటర్
  • ఓటమి భయంతోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు

మహాకూటమిలో భాగంగా తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని టీడీపీ నేత నందీశ్వర్ గౌడ్ అన్నారు. మహాకూటమి అభ్యర్థిని పటాన్ చెరులో 25 వేలకు పైగా మెజార్టీతో గెలిపిస్తానని చెప్పారు. లక్ష మందితో బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి ఒక రౌడీ షీటర్ అని, రెండున్నరేళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తి అని చెప్పారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ కాపాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలో మహాకూటమి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సమక్షంలో ఈరోజు నందీశ్వర్ గౌడ్ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు భారీ సంఖ్యలో అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ భిక్షతోనే తాను రాజకీయాల్లో ఎదిగానని నందీశ్వర్ గౌడ్ తెలిపారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన రిజర్వేషన్ల వల్లే తాను గెలుపొందానని చెప్పారు. తెలుగుదేశం పార్టీని చూస్తే కేసీఆర్ కు ఎందుకు భయం కలుగుతోందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఆకాశమంత ఎత్తున ఉన్న చంద్రబాబుపై ఉమ్మివేస్తే... ఎవరి మీద పడుతుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. 

More Telugu News