Kerala: శబరిమలలో ఎన్నో పోయాయి... ఇంకేం మిగిలింది: పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు!

  • మలయాళ ఆదివాసీల ఆచారాలు ఎక్కడ?
  • కొందరి కుట్రతో అన్నీ మాయమైపోయాయి
  • ప్రస్తుత ఆందోళనలు కూడా అటువంటివేనన్న పినరయి

శబరిమలలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై రాష్ట్ర సీఎం పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న శబరిమల ఆలయం ఇప్పటికే ఎన్నింటినో కోల్పోయిందని ఆయన అన్నారు. మలయాళ ఆదివాసీలు శబరిమలలో నిర్వహించే ఎన్నో ఆచారాలు ఇప్పుడు కనిపించడం లేదని, కొందరి స్వార్థపూరిత కుట్రల కారణంగా అవన్నీ ఇప్పుడు కనిపించడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు కూడా అటువంటివేనని, ఇందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కారణాలని చెప్పారు.

మిగతా ఆలయాలతో పోలిస్తే అయ్యప్ప దేవాలయం చాలా ప్రత్యేకమైనదని, ఈ ఆలయంలోనికి ఎవరైనా ప్రవేశించవచ్చని అంటూనే, ఈ విషయంలో సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ లు ఎప్పుడూ అసహనంతో ఉంటున్నాయని, ఆలయ ప్రత్యేకతను చెడగొట్టాలన్నదే వారి ప్రయత్నమని తన సోషల్ మీడియా ఖాతాల్లో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఫ్యూడల్ భావజాలాన్ని వ్యాపింపజేస్తుండటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరుగలేదని అన్నారు. ఈ పరిణామాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పారు. రెండు రోజుల క్రితం శబరిమల ఆలయం తెరచుకోగా, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, మహిళల ప్రవేశాన్ని భక్తులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.

More Telugu News