Rashma Nishanth: తీవ్ర వివాదానికి దారితీసిన మహిళ ఫేస్‌బుక్ పోస్ట్.. ఆమె ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులు

  • శబరిమల గర్భగుడి మెట్లెక్కుతానని పోస్ట్
  • అడ్డుకుంటామని బెదిరింపులు
  • రేష్మాకు వ్యతిరేకంగా నినాదాలు

బుధవారం నుంచి శబరిమల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని కన్నూర్ కి చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు తీవ్ర వివాదాస్పదమైంది. ఇటీవల సుప్రీంకోర్టు 10-50 ఏళ్లున్న మహిళలు కూడా శబరిమల ఆలయానికి వెళ్లొచ్చంటూ తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ తీర్పు కేరళలో తీవ్ర ఆందోళనలకు కారణమైంది.

రేష్మా నిషాంత్ అనే మహిళ తాను శబరిమల గర్భగుడి మెట్లెక్కుతానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. ఇందులో విప్లవం ఏమీ లేదని... ఒక భక్తురాలు ముందడుగు వేస్తే అది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని.. ఆలయంలోకి వెళ్లే ధైర్యాన్ని కలిగిస్తుందని పోస్టులో పేర్కొంది. రుతుక్రమం శరీరంలో చోటుచేసుకొనే ఇతర చర్యల లాంటిదేనని ఆమె అభిప్రాయపడింది. ఈ పోస్టు తీవ్ర వివాదమైంది. ఒక వర్గానికి చెందిన ఆందోళనకారులు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. రేష్మాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాదు.. ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు.

More Telugu News