TRs: టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ

  • సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన టీ-మంత్రులు
  • కొడంగల్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: నాయిని
  • మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ను గెలిపిస్తాం: హరీశ్ రావు

బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తన పార్టీని వీడారు. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్ రావు  ఆయన్ని సాదరంగా ఆహ్వానించగా, పార్టీ కండువా కప్పిన నాయిని ఆయనకు అభినందనలు తెలిపారు. సత్యనారాయణతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, కొడంగల్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంపై విమర్శలు గుప్పించే హక్కు కాంగ్రెస్, టీడీపీలకు లేదని అన్నారు. టీఆర్ఎస్ తో పోటీపడే పార్టీలు తెలంగాణలో లేవని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీజేపీ తరపున ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిస్తే అదృష్టవంతులేనని సెటైర్లు వేశారు.

హరీశ్ రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో సత్యనారాయణ చేరికతో మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతమైందని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మెదక్ జిల్లాలో అన్ని చోట్లా టీఆర్ఎస్ ను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News