India: పొట్టి బట్టలు కట్టుకో, నాతో తాగు... అమెరికాలో భర్త వేధింపులు తాళలేక, ఇండియాకు వచ్చి యువతి ఆత్మహత్య!

  • భర్త పైశాచిక ఆనందాన్ని తాళలేకపోయిన మాధురి
  • 2016లో వివాహం, అప్పటి నుంచి చెడు కోరికలు
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

ఓ కిరాతక భర్త పైశాచిక ఆనందాన్ని తట్టుకోలేని ఓ యువతి, పెళ్లయిన రెండేళ్లలోనే తనువు చాలించింది. పెళ్లి చేసి తమ కుమార్తెను అమెరికా పంపించామన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు మిగలకుండా చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మాల్యాద్రి, గంగాధరి దంపతులు నేరేడ్ మెట్ లో నివాసం ఉంటూ తమ చిన్న కుమార్తె మాధురిని బీటెక్ చదివించారు. మాధురికి మధ్యవర్తుల ద్వారా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న కోటేశ్వరరావు సంబంధం రాగా, 2016 నవంబర్ లో ఘనంగా వివాహం జరిపించారు. ఆ తరువాత భర్తతో కలసి తమ బిడ్డ అమెరికాకు వెళితే, సంబరపడిపోయారు.

అక్కడికి వెళ్లిన తరువాత మాధురికి, కోటేశ్వరరావు అసలు స్వరూపం తెలిసింది. పొట్టి దుస్తులు ధరించి బయటకు రావాలని, లో దుస్తులు ధరించి పేకాట ఆడుతూ మందు కొట్టాలని హింసించడం ప్రారంభించాడు. ఇది సరికాదంటే చిత్ర హింసలు పెట్టాడు. దీంతో విసిగిన మాధురి గతంలో ఇండియాకు రాగా, రెండు కుటుంబాలూ నచ్చజెప్పి తిరిగి అమెరికాకు పంపించాయి.

అయినా కోటేశ్వరరావు బుద్ధి మారలేదు. ఇక అతని వేధింపులు తాళలేని మాధురి, 11వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చింది. అక్కడ జరుగుతున్న ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఓదార్చే క్రమంలో ఉండగానే, నిన్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మాధురి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

More Telugu News