love failure: ప్రేమకు నో చెప్పిన యువకుడు.. చెల్లితో కలిసి ప్రాణాలు తీసుకున్న అక్క!

  • చిత్తూరు జిల్లాలోని కలికిరిలో ఘటన
  • ఓ యువకుడిని ప్రేమించిన తస్లీమ్
  • ఒప్పుకోకపోవడంతో బలవన్మరణం

తాను ప్రేమించిన యువకుడు నో చెప్పడంతో ఓ యువతి మనస్తాపానికి లోనయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను లేకుండా చెల్లెలు బతకలేదని భావించిన యువతి తన ప్రేమ విఫలమయిన విషయాన్ని చెల్లికి చెప్పింది. అనంతరం ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని కలికిరి పట్టణంలో చోటుచేసుకుంది.

  కలికిరి పట్టణానికి చెందిన అక్కాచెల్లెళ్లు తస్లీమ్, షికాబీ ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. గత కొంత కాలంగా తస్లీమ్ ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే అతను ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి లోనైంది. ఈ విషయాన్ని ఆమె చెల్లి షికాబీకి చెప్పింది. దీంతో ఇద్దరు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్రతుకుదెరువు కోసం కువైట్ కు వెళ్లిన తండ్రి అజంతుల్లా కుమార్తెల అంత్యక్రియలకు రాలేకపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఇటీవలే కువైట్ కు వెళ్లడంతో తిరిగిరావడం వీలుకాలేదని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, విచారణ జరుపుతున్నామని కలికిరి ఎస్సై శ్రీనివాసులు పేర్కొన్నారు. గతంలో ఇంటర్ చదువుతున్న సమయంలో అభిప్రాయభేదం రావడంతో వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారన్నారు. అక్కాచెల్లెళ్లు ఎంతో అనోన్యంగా ఉండేవారన్నారు.

More Telugu News