Revanth Reddy: రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి!

  • ఇవన్నీ గాలి మాటలు
  • ఒక లక్ష రూపాయలు కూడా దండగే
  • కేసీఆర్, కేటీఆర్ పైన కాదు దమ్ముంటే నాపై గెలువు

టీ-కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డిని ఓడించేందుకు వందకోట్ల ఒప్పందం కుదిరిందంటూ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని అన్నారు.

ఇందుకోసం ఒక లక్ష రూపాయలు కూడా దండగేనని, ఇవన్నీ గాలి మాటలని కొట్టిపారేశారు. కేసీఆర్, కేటీఆర్ పైన కాదు, రేవంత్ కు దమ్మూధైర్యం ఉంటే తనపై గెలవాలని నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని, అభివృద్ధి పథకాలపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రకంగా మేలు జరిగిందని, ఈ దీపావళి నాటికి మిషన్ భగీరథ నీళ్లు అన్ని గ్రామాలకు అందుతాయని చెప్పారు. రాబోయే రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని వివరించారు. కొడంగల్ ‘మిషన్ భగీరథ’ ఆలస్యానికి కారణం రేవంత్ తీరేనని దుయ్యబట్టారు.

More Telugu News