geetagovindam: ‘గీతగోవిందం’ సెట్ లో పరశురామ్ నన్ను ఏడిపించారు!: రష్మిక మందన

  • ఎవరైనా మాట్లాడకుంటే ఇబ్బందిగా ఫీలవుతా
  • వంట కొంచెం వచ్చు, కేక్ బాగా చేస్తా
  • మీడియాతో ముచ్చటించిన రష్మిక

తాను అల్లరిపిల్లలా కనిపించినప్పటికీ, చాలా సున్నితమైన వ్యక్తినని హీరోయిన్ రష్మిక మందన తెలిపింది. ఎవరైనా ముభావంగా ఉంటే ‘నా కారణంగానే వాళ్లు బాధపడుతున్నారా?’ అని హైరానా పడిపోతానని వెల్లడించింది. దేవదాస్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో రష్మిక పలు అంశాలపై మీడియాతో ముచ్చటించింది. గీతగోవిందం షూటింగ్ సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ తనను ఆటపట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా రష్మిక పంచుకుంది.

ఓసారి గీతగోవిందం షూటింగ్ స్పాట్ కు వెళ్లడం కొంచెం ఆలస్యం అయిందని రష్మిక తెలిపింది. ‘‘నాతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడకపోతే చాలా ఇబ్బంది పడిపోతా. ఆరోజు షూటింగ్ స్పాట్ కు కొంచెం ఆలస్యంగా వెళ్లడంతో సెట్ లో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. నేను పలకరించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో నేను ఓ చోట కూర్చుని ఏడ్చేశా. వెంటనే దర్శకుడు పరశురామ్ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ‘నిన్ను ఆటపట్టించడానికే ఇదంతా చేశాం’ అంటూ ఓదార్చారు. అప్పటివరకూ నన్ను ఫాలో అవుతున్న కెమెరాను పరశురామ్ చూపించారు. అసలు నన్ను ఓ కెమెరా ఫాలో అవుతుందని అప్పటివరకూ నాకు తెలియలేదు’’ అని ఈ ఘటనను రష్మిక గుర్తుచేసుకుంది.

తనకు పుస్తకాలు ముట్టుకుంటే నిద్ర వచ్చేస్తుందనీ, సినిమా పాటలు మాత్రం బాగా వింటానని రష్మిక తెలిపింది. వంట చేయడం కూడా కొంచెంకొంచెం వచ్చని వెల్లడించింది. ఇక కేక్ అయితే అద్భుతంగా చేస్తానని రష్మిక చెప్పింది.

More Telugu News