Tamilnadu: మందుకొడితే మామూలోడు కాదు.. గ‘మ్మత్తు’ విన్యాసాలు చేస్తాడు!

  • తమిళనాడు రాష్ట్రం సేలం వాసి జేమ్స్‌ తీరిది
  • మంగళవారం ట్రాన్స్‌ఫార్మర్‌పైకెక్కి కూర్చున్న వైనం
  • అదృష్టవశాత్తు సరఫరా లేకపోవడంతో బతికిపోయాడు

మందుబాబుల గమ్మత్తు విన్యాసాలు కొత్తేమీ కాదు. కాకుంటే తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తు తలకెక్కితే ఎత్తయిన గోడలు, ట్యాంకర్‌ లారీలు వంటి వాటి పైకెక్కి కూర్చుంటాడు. ఆ సందర్భంగా ప్రమాదాలతో దోబూచులాడుతుంటాడు. మంగళవారం ఇటువంటి చర్యకే పాల్పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే...సేలం సూరమంగళం సమీపంలోని జాగీర్‌ అమ్మాపాళయం ప్రాంతానికి చెందిన జేమ్స్‌ (60)  ఉదయం 11.30 గంట ప్రాంతంలో పూటుగా మద్యం సేవించాడు. తర్వాత ధర్మానగర్‌లో ఉన్న ఓ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పైకెక్కి కూర్చున్నాడు. చుట్టూ వైర్లు, కింద ట్రాన్స్‌ఫార్మర్‌ చూసిన స్థానికులు హడలిపోయారు. అయితే అదృష్టవశాత్తు ఆ సమయానికి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

పరిస్థితి చూసి అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్థానిక విద్యుత్‌ శాఖ కార్యాలయానికి ఫోన్‌చేసి పరిస్థితి వివరించారు. సరఫరా ఇవ్వొద్దని కోరారు. ఆ తర్వాత జేమ్స్‌ను కిందికి దింపి చీవాట్లు పెట్టారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. మందు కొట్టేటప్పుడు జేమ్స్‌ చేష్టలు ఏమిటో తెలుసుకుని విస్తుపోయారు.

More Telugu News