Chennai: ఏపీ ప్రైవేటు బస్సులో ప్రయాణికుడి నుంచి రూ.1.5 కోట్లు నగదు స్వాధీనం!

  • తనిఖీల్లో పట్టుబడిన కోటిన్నర నగదు
  • నగలు కొనేందుకు తెచ్చానన్న దుర్గారావు
  • ఆధారాలు చూపించకపోవడంతో స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి వెళ్లిన ఓ ప్రైవేటు బస్సులోని ప్రయాణికుడి నుంచి పోలీసులు రూ.1.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో విజయవాడలోని పాయకాపురానికి చెందిన దుర్గారావు (35)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కా ఎర్ర చందనం పెద్ద ఎత్తున అక్రమ రవాణా అవుతుందన్న సమాచారంతో సోమవారం అర్ధరాత్రి రెడ్‌హిల్స్ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ప్రైవేటు బస్సును తనిఖీ చేస్తుండగా దుర్గారావు అనే వ్యక్తి వద్ద పెద్ద ప్లాస్టిక్ సంచి కనిపించింది. దానిని తెరిచి చూసిన పోలీసులు షాకయ్యారు. అందులో కొత్త ఐదు వందల రూపాయల నోట్లు, రెండు వేల రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో దుర్గారావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నగలు కొనడానికి ఆ డబ్బును తీసుకొచ్చినట్టు అతను చెప్పాడు. అయితే, అందుకు తగ్గ ఆధారాలు చూపించకపోవడంతో నగదు స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News