maoists: అనుచరులతో చేరికల ఎరవేసి...ఎమ్మెల్యేను లివిటిపుట్టువైపు రప్పించిన మావోయిస్టులు?

  • ముందురోజే పరిసర గ్రామాలన్నీ తమ అధీనంలోకి
  • పార్టీలోకి వలసలు వున్నాయంటూ సమాచారం  
  • అలా వారి ఉచ్చులో చిక్కుకున్న కిడారి

హిట్‌ లిస్ట్‌లో ఉన్న ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మారుమూల పల్లెకు రావడం అన్నది అంత సులభంగా అయ్యే పనికాదని భావించిన మావోయిస్టులు అందుకు భారీ వ్యూహరచనే చేసినట్లు సమాచారం. ఇందుకోసం ఎమ్మెల్యే అనుచరులనే పావులుగా వినియోగించినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావు అనంతరం అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది నచ్చని కొందరు వైసీపీ నేతలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు.

వారిని టీడీపీలో చేరే విధంగా ఒప్పించినట్లు సంకేతాలు పంపి ఎమ్మెల్యేను లివిటిపుట్టు వరకు రప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్యేకు నమ్మకమైన అనుచరుల ద్వారా మావోయిస్టులు కథ నడిపించారంటున్నారు. పక్కాప్రణాళికతో వచ్చిన మావోయిస్టు అగ్రనేతలు శనివారం సమావేశమై ఈ మేరకు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది.

ముందురోజే లివిటిపుట్టు, పరిసర గ్రామాలన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టుల సూచన మేరకు కిడారి అనుచరులు కొందరు కండ్రూం పంచాయతీలో పార్టీ సమావేశం ఉందని, అక్కడ కొన్ని చేరికలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధినాయకుని దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కిడారి ముందూ వెనుకా చూడకుండా వచ్చి దొరికిపోయినట్లు భావిస్తున్నారు.

More Telugu News