husband: ప్రియుడి సాయంతో భర్త గొంతుకోసిన భార్య.. 60 సవర్ల బంగారంతో జంప్!

  • తమిళనాడులోని కొడైకెనాల్ లో ఘటన
  • డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ
  • విహారయాత్రకు తీసుకెళ్లి మర్డర్

జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్తను ఓ ఇల్లాలు ప్రియుడి సాయంతో కడతేర్చింది. ప్రియుడి మోజులో కన్నబిడ్డ భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా అతనితో కలిసి పారిపోయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహ్మద్‌ సమీర్‌(32) గల్ఫ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ప్రదోష్ అనే మహిళతో సమీర్ వివాహమైంది. వీరికి ఆరు నెలల వయసున్న పాప ఉంది. గల్ఫ్ లో పనిచేసే  సమీర్ 6 నెలలకు ఓసారి ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో ప్రదోష్ కు మంగళూరులో డ్రైవర్ గా పనిచేస్తున్న మొహమ్మద్ యాసిన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో సమీర్ ను వదిలించుకుని యాసిన్ ను పెళ్లి చేసుకోవాలని ప్రదోష్ అనుకుంది. స్వదేశానికి వచ్చిన భర్తను కొడైకెనాల్ విహారయాత్రకు వెళదామని ఒప్పించిన ప్రదోష్, ప్రియుడిని అక్కడకు రావాలని సూచించింది.

ఈ నెల 17న కొడైకెనాల్ లో భర్త సమీర్ ను ప్రియుడితో కలిసి గొంతు కోసి, కిరాతకంగా హత్యచేసిన ప్రదోష్.. కుమార్తెతో కలిసి ఒంటరిగా ఇంటికి చేరుకుంది. భర్త ఎక్కడని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. స్నేహితులతో కలసి అర్జంటుగా సేలం వెళ్లాడని జవాబు ఇచ్చింది. అనంతరం ఇంట్లోని 60 సవర్ల నగలను తీసుకుని ఉడాయించింది. ఆమె వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో దిండుక్కల్-కొడైకెనాల్ రోడ్డుపై టంటంపారై పర్వతప్రాంతంలో ఈ నెల 18న ఓ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడు సమీరేనని ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, పరారీలో ఉన్న ప్రదోష్, యాసిన్ ల కోసం గాలిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News