Goldpair: బంగారంతో రూపం... వజ్రాల తాపడం!: అత్యంత ఖరీదైన మహిళల పాదరక్షలు

  • ధర రూ.123 కోట్ల పైమాటే
  • రూపశిల్పులు ‘జాదా దుబాయ్‌-ఫ్యాషన్‌ జ్యూవెలర్స్‌’
  • నేడు యాభై మంది కుబేరుల సమక్షంలో ఆవిష్కరణ

బంగారంతో రూపం... దాని అందాన్ని ఇనుమడింపజేసేందుకు వజ్రాల తాపడం...ఇంతలా చేశాక అదేమంతా తక్కువ ధర పలుకుతుందా? నిజమే...ఖరీదు కూడా 123 కోట్ల రూపాయలు పైమాటే. అలాగని ఇదేదో గృహోపకరణ వస్తువో, కారో, బంగ్లానో అనుకుంటున్నారా?. కచ్చితంగా కాదు. మహిళలు ధరించే జత పాదరక్షల ఖరీదు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం!

 యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని ప్రఖ్యాత బ్రాండ్‌ ‘జాదా దుబాయ్‌’, ప్రముఖ ఆభరణాల సంస్థ ‘ఫ్యాషన్‌ జ్యూవెలర్స్‌’తో కలిపి ఈ పాదరక్షలను రూపొందించింది. ఇందుకోసం వీరికి తొమ్మిది నెల సమయం పట్టిందట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుర్జుదుబాయ్‌లో బుధవారం వీటిని లాంఛనంగా ఆవిష్కరించాలని తయారీ సంస్థలు నిర్ణయించాయి. ఇందుకోసం కుబేర సమానులైన 50 మంది ప్రముఖులను ఈ సంస్థ ఆహ్వానించిందని ‘ఖలీజ్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఈ ఆవిష్కరణ అనంతరం ఆర్డర్‌పై ఇటువంటి పాదరక్షలు తయారు చేయాలన్నది ఈ సంస్థ ఆలోచన.

More Telugu News