Andhra Pradesh: మావోయిస్టుల ఎఫెక్ట్.. విశాఖ ఏజెన్సీకి బస్సుల్ని ఆపేసిన ఆర్టీసీ!

  • ఇద్దరు టీడీపీ నేతలను చంపేసిన మావోలు
  • నిర్మానుష్యంగా మారిన అరకు-ఎస్.కోట రోడ్డు
  • ముందుకురాని ప్రైవేటు వాహనదారులు

విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోలు కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఈ రోజు కూడా బస్సులు తిరగవని అధికారులు స్పష్టం చేశారు.

ఇద్దరు నేతలు చనిపోవడంతో వారి అనుచరులు వాహనాలను ధ్వంసం చేస్తారన్న భయంతో బస్సులను నడపటానికి ఆర్టీసీ అధికారులు ముందుకురాలేదు. దీంతో తమకు బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరుతూ నిన్న రాత్రి ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విశాఖ నుంచి అరకుకు వచ్చే బస్సులను ఎస్.కోటలో నిలిపివేయడంపై చాలా మంది పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అమ్మినాయుడు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళన చేస్తున్న టూరిస్టులతో చర్చించారు. జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ద్వారా ప్రయాణికులను వెనక్కు పంపడానికి నిర్ణయించారు. కొత్తవలసలో రాత్రి 10 గంటలకు వచ్చే ఈ రైలుకు ఎస్‌.కోటలో స్టాప్‌ లేకపోవడంతో ప్రయాణికులందరినీ ప్రత్యేకంగా రెండు బస్సుల్లో రాత్రి 8.15 గంటల ప్రాంతంలో కొత్తవలస రైల్వేస్టేషనుకు పంపారు. మరోవైపు ఈ రూట్లో తిరిగేందుకు ప్రైవేటు వాహనదారులు ఇష్టపడటం లేదు. 

More Telugu News