Vizag: 'వస్తానన్నాడు... నువ్వెక్కడ వస్తావులే అన్నాను'... అదే జరిగిందని బోరున విలపించిన కిడారి భార్య పరమేశ్వరి!

  • చివరి ఫోన్ కాల్ ను గుర్తు చేసుకున్న పరమేశ్వరి
  • డ్రైవర్ ఫోన్ చేయగానే ఏమీ తోచలేదు
  • నక్సల్స్ తో ముప్పు ఉందన్న విషయాన్ని భర్త చెప్పలేదన్న పరమేశ్వరి

గ్రామదర్శిని కార్యక్రమంలో బయలుదేరే ముందు తన భర్త చేసిన చివరి ఫోన్ కాల్ ను గుర్తు చేసుకున్న కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం నాడు గ్రీవెన్స్ కార్యక్రమం ఉండటంతో తాను విశాఖపట్నం వచ్చేశానని, విశాఖకు వచ్చాక భర్తకు ఫోన్ చేయగా, ఆయన కూడా వస్తున్నానని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

"నీవు అలాగే అంటావు.. నీ కార్యక్రమాలు నీకుంటాయి. ఎక్కడొస్తావు" అని తాను అన్నానని, చివరకు అదే జరిగిందని ఆమె బోరున విలపించారు. డ్రైవర్ ఫోన్ చేసి, సార్ ను నక్సల్స్ చంపేశారని చెప్పగానే తనకేమీ తోచలేదని, సహాయం కోసం స్నేహితుల ఇంటికి పరుగులు తీశానని చెప్పారు. కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేశానని అన్నారు. నక్సల్స్ నుంచి తనకు ముప్పు ఉందన్న విషయాన్ని భర్త ఎన్నడూ చర్చించలేదని, అసలా విషయం ఎప్పుడూ తమ మధ్య చర్చకే రాలేదని చెప్పుకొచ్చారు.

More Telugu News