Hydrogen Rail: ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. జర్మనీలో పట్టాలెక్కిన పర్యావరణ హిత రైలు!

  • తయారు చేసిన ఫ్రాన్స్ సంస్థ
  • ఒకసారి ఇంధనం నింపితే వెయ్యి కిలోమీటర్ల పరుగులు
  • జీరో కాలుష్యం

ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు జర్మనీలో పరుగులు పెట్టింది. పూర్తిగా పర్యావరణ హితమైన ఈ రైళ్లు డీజిల్‌తో నడిచే రైళ్లతో పోలిస్తే ఖరీదైనవే అయినప్పటికీ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ రైళ్లు. ఒక్కసారి దీని హైడ్రోజన్ ట్యాంకును నింపితే ఏకంగా వెయ్యి కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ట్యాంకు నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. కొరాడియా ఐలింట్‌గా పిలుస్తున్న ఈ రైళ్లను ఫ్రాన్స్‌కు చెందిన ‘అల్‌స్టోమ్’ తయారు చేసింది. 2021 నాటికి 14 హైడ్రోజన్ రైళ్లను తయారుచేయనున్నట్టు అల్‌స్టోమ్ తెలిపింది.  

హైడ్రోజన్ రైళ్లలో ఉపయోగించే ఇంధనం వల్ల కాలుష్య ఉద్గారాలు ఉత్పత్తి కావు. అందుకనే ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. హైడ్రోజన్, ఆక్సిజన్‌లను కలపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యవస్థ ఇందులో ఉంటుంది. అవసరానికి మించి విద్యుత్తు కనుక ఉత్పత్తి అయితే, అది నేరుగా రైలులో ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీల్లోకి చేరి నిల్వ ఉంటుంది.  

తొలి రైలును జర్మనీ సోమవారం పట్టాలపైకి తెచ్చింది. కక్సావెన్‌, బ్రెమెరావెన్‌, బ్రెమెర్‌వోర్డ్‌, బక్సెహుడ్‌ నగరాల మధ్య 1000 కిలోమీటర్ల మార్గంలో రెండు హైడ్రోజన్‌ రైళ్లు సేవలు అందించనున్నాయి.

More Telugu News