Andhra Pradesh: ఏపీలో కుక్కలు చాలా క్రూరంగా మారిపోయాయి అధ్యక్షా! వెంటపడి మరీ కరుస్తున్నాయి!: బీజేపీ నేత విష్ణుకుమార్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో నవ్వులు

  • కుక్కలపై దండయాత్ర చేయాలని  విజ్ఞప్తి
  • ప్రజలు రోడ్లపై తిరగలేకపోతున్నారని వ్యాఖ్య
  • సమాధానమిచ్చిన మంత్రి యనమల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న కుక్కల బెడదపై బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాజు చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూశాయి.  ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

 విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. విశాఖపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడద పెరిగిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమం లాగే కుక్కలపై దండయాత్రను కూడా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు కాబట్టి కుక్కలు వారి ఇళ్ల సమీపానికి రాకపోవచ్చనీ, తనతో సహా సామాన్యులను మాత్రం వెంటపడి మరీ కరుస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటి కుక్కలు చాలా క్రూరంగా మారిపోయాయని చమత్కరించారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలతో అసెంబ్లీలోని సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

ఈ సందర్భంగా మంత్రి యనమల స్పందిస్తూ.. కుక్కల బెడదకు సంబంధించిన వ్యవహారాలను మున్సిపల్ మంత్రిత్వశాఖ చూస్తోందని తెలిపారు. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

More Telugu News