Narendra Modi: అయ్యా ప్రధాని గారూ.. అన్ని కోట్ల మంది పకోడీలు వేస్తే.. తినేవారెవరు?: తేజస్వీ యాదవ్

  • ప్రధాని పకోడీ వ్యాఖ్యలపై తేజస్వీ విసుర్లు
  • ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షల్లో తొలుత రూ.2 లక్షలు వేయాలని వినతి
  • నితీశ్ మోసకారి అంటూ ఫైర్

ప్రధాని నరేంద్రమోదీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. గతంలో మోదీ చేసిన పకోడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అందరూ పకోడీలు చేస్తే తినేవారెవరని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన మోదీ ఇప్పుడు పకోడీలు అమ్ముకుంటే రోజుకు రెండు వందలు వస్తాయని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పోనీ ఆయన చెప్పినట్టు రెండు కోట్ల మందీ పకోడీ దుకాణాలు పెట్టుకుంటే కొనేవారు ఎవరని సూటిగా ప్రశ్నించారు.

ఆయన చెప్పినట్టుగానే పకోడీ దుకాణాలు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న తేజస్వీ యాదవ్.. నల్లధనం బయటకు తీసి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలోనూ వేస్తామన్న రూ.15 లక్షల్లోనూ.. కనీసం లక్షో, రెండు లక్షలోనైనా ఇస్తే దుకాణం పెట్టుకుంటామని పేర్కొన్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పైనా తేజస్వీ నిప్పులు చెరిగారు. గతంలో బీజేపీకి మిత్రుడిగా ఉన్న నితీశ్ తన తప్పు తెలుసుకుని దానికి దూరమయ్యారని, దీంతో తాము మద్దతు ఇస్తే... మళ్లీ ఆయన బీజేపీ పంచన చేరారని విమర్శించారు. ఇక ఎప్పటికీ తాము నితీశ్‌తో కలవబోమన్నారు. 

More Telugu News