Maruti Rao: ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని చంపించిన మారుతీరావు 'ఘన' చరిత్ర ఇది!

  • ఎవరు అధికారంలో ఉంటే, ఆ పార్టీలో ఉండే మారుతీరావు
  • రేషన్ డీలర్ గా ప్రారంభమైన మారుతీరావు జీవితం
  • భూ దందాలు చేస్తూ, రెవెన్యూ అధికారులతో అంటకాగే వైనం 

తిరునగరు మారుతీరావు... కుమార్తె తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకుందన్న ఆగ్రహంతో, కుమార్తెకన్నా, పరువే ముఖ్యమని భావించి, అల్లుడిని హత్య చేయించిన వ్యక్తి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మారుతీరావుకు 'ఘన'మైన చరిత్రే ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ నేతలతో అంటకాగి తిరుగుతూ ఉండే మారుతీరావు, రెవెన్యూ, పోలీసు అధికారులతో దగ్గరి సంబంధాలను కలిగివున్నాడు.

ఓ రేషన్ డీలర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన, అదే డిపార్టుమెంటులోని అధికారులతో బలమైన సంబంధాలు ఏర్పరచుకుని, వారి అండతో భూ దందాలు సాగించినట్టు తెలుస్తోంది. పై అధికారుల సరదాలు తీర్చి, వారితో పనులు చేయించుకోవడంలో మారుతీరావుది అందెవేసిన చేయి.

మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లర్లు, ఆర్యవైశ్యుల మధ్య ఏర్పడే పంచాయితీలను మారుతీరావు సెటిల్ చేస్తుంటాడని సమాచారం. కుల సంఘాల నాయకుల అవసరాలను తీరుస్తూ, రాజకీయ నేతలకు దగ్గరగా ఉంటూ, వారిని తనకు అనుకూలంగా మలచుకుంటాడని తెలుస్తోంది. మారుతీరావు ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఆయన సోదరులు, ఇదే కేసులో అరెస్టయిన మరో నిందితుడు శ్రవణ్, ఓ వైపు కేబుల్ వ్యాపారాన్ని, మరోవైపు బెల్లం వ్యాపారాన్ని సాగిస్తుండేవాడు. అన్న కుమార్తె చేసిన పనిని తట్టుకోలేని శ్రవణ్ కూడా, హత్యకు తనవంతు సాయం చేశాడన్న సంగతి తెలిసిందే.

More Telugu News