balka suman: నాపై హత్యాయత్నం జరిగింది: బాల్క సుమన్

  • నాపై పెట్రోల్ పోసి, నిప్పంటించేందుకు యత్నించారు
  • కావాలని నేను ఎవరి సీటు తీసుకోలేదు
  • చెన్నూరులో పోటీ చేయమని కేసీఆరే నాకు చెప్పారు

చెన్నూరు నియోజకవర్గం ఇందూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలును కాదని సుమన్ కు టికెట్ కేటాయించడంపై... ఓదేలు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఒంటిపై పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో మరి కొందరికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై బాల్క సుమన్ స్పందించారు.

చెన్నూరులో పోటీ చేయమని తమ అధినేత కేసీఆర్ తనను ఆదేశించారని బాల్క సుమన్ చెప్పారు. ఎవరి సీటును తాను కావాలని తీసుకోలేదని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో తాను చెన్నూరు నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఓదేలు మద్దతుదారులు తనపై పెట్రోలు పోసి, అగ్గిపుల్ల వేసేందుకు యత్నించారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. తన గన్ మెన్ తో పాటు మరికొందరు మిత్రులు తనను రక్షించారని చెప్పారు. తనపై హత్యాయత్నం చేసినవారికి ఒకటే చెబుతున్నానని... తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. 

More Telugu News