జీవితంలో మరచిపోలేని క్షణం.. గొప్ప అనుభూతిని కలిగించింది: చంద్రబాబు

- నేనే శంకుస్థాపన చేశా.. నేనే గ్యాలరీ వాక్ చేశా
- అతి త్వరగా పూర్తయిన ప్రాజెక్టుగా పోలవరం చరిత్రలో నిలిచి పోతుంది
- 57 ప్రాజెక్టులు పూర్తైతే.. అన్ని చెరువులకు నీరు ఇవ్వచ్చు
ప్రతిపక్షాలు చేసే రాజకీయ విమర్శలను తాము పట్టించుకోమని... మంచి సూచనలు ఇస్తే మాత్రం లోపాలను సరిదిద్దుకుంటామని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షాలకు రాజకీయాలు కావాలని, తనకు మాత్రం రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పారు. మే లోపు ప్రాజెక్టును పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీటిని తీసుకెళ్తామని తెలిపారు. ప్రాజెక్టుకు ఆటంకాలు కలగకుండా ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపించానని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని తెలిపారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రాజెక్టుపై సమీక్ష జరుపుతున్నానని చెప్పారు.
ఇప్పటి వరకు 27 సార్లు పోలవరంను సందర్శించి పనులను పరిశీలించానని చంద్రబాబు తెలిపారు. పోలవరం కుడి కాలువ పనులు 90 శాతం, ఎడమ కాలువ పనులు 63.58 శాతం పూర్తయ్యాయని చెప్పారు. అతి త్వరగా పూర్తయిన ప్రాజెక్టుగా పోలవరం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే... ఇప్పటికే పనులు పూర్తయ్యేవని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా జలదీక్ష తీసుకున్నానని చెప్పారు. నీరు-ప్రగతి పథకం కింద ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానని తెలిపారు. 57 ప్రాజెక్టులు పూర్తయితే... రాష్ట్రంలోని అన్ని చెరువులకు నీరు ఇవ్వచ్చని చెప్పారు.