Bonthu Ram Mohan: కేటీఆర్ తో భేటీ అనంతరం అలకవీడిన హైదరాబాద్‌ మేయర్‌.. అసంతృప్తులను బుజ్జగించే పనిలో బొంతు!

  • నిన్న కేటీఆర్‌తో సమావేశమైన అనంతరం రంగంలోకి దిగిన బొంతు
  • గ్రేటర్‌లో పలు నియోజకవర్గాల నాయకులతో చర్చలు
  • పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చేలా కృషి

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిశాక హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అలకవీడారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్‌ అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాలకు వెళ్లి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారితో మాట్లాడి వచ్చారు. శేరిలింగంపల్లిలో కార్పొరేటర్‌ జగదీష్‌గౌడ్‌ను కలిసి చర్చించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కార్పొరేటర్లు, నాయకులతో పార్టీ ఇన్‌చార్జి పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి చర్చించారు.

 అసంతృప్తులతో ఫోన్‌లో కేటీఆర్‌తో కూడా మాట్లాడించినట్లు సమాచారం. ఎంపీ మల్లారెడ్డితో కలిసి ఎల్‌బినగర్‌లోని ఏడుగురు కార్పొరేటర్లతో మాట్లాడి, నియోజక వర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ఆర్. రామ్మోహన్‌గౌడ్‌కు మద్దతిచ్చేలా ఒప్పించారు. మరోపక్క కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఉప్పల్ నేత బండారి లక్ష్మారెడ్డి మేయర్‌తో సమావేశమైనట్లు సమాచారం.

More Telugu News