Donald Trump: ‘యాపిల్’ పీకల మీదకు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం!

  • అమెరికా-చైనా మధ్య జోరుగా వాణిజ్య యుద్ధం
  • చైనాలో ఉత్పత్తులను నిలిపివేయాలని సూచన
  • అమెరికా వచ్చి పన్నుల నుంచి బయటపడాలన్న ట్రంప్

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడమంటే ఇదేనేమో! అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం అటూ ఇటు తిరిగి చివరికి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ మీదకు వచ్చింది. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో కష్టాలు పాలుకాకుండా ఉండాలంటే చైనాలో ఉత్పత్తిని ఆపేసి వెంటనే అమెరికాకు తరలి రావాలని, ఇకపై అమెరికాలోనే ఉత్పత్తులు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్‌కు సూచించారు.

చైనాలో ఉన్న అమెరికా కంపెనీలన్నింటికీ ట్రంప్ ఇప్పటికే అమెరికా తరలి రావాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది. అమెరికా క్రమంగా వాణిజ్య లోటులోకి చేరుకుంటోందని, ఇది అమెరికన్లకు పెను ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. కాబట్టి చైనాలో ఉత్పత్తిని నిలిపివేసి వెంటనే అమెరికా తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.

చైనాపై తాము విధించే ఆంక్షల వల్ల యాపిల్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని, అయితే, అవి సున్నా ట్యాక్స్‌గా మారేందుకు ఓ అద్భుతమైన పరిష్కారం కూడా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘చైనాకు బదులుగా అమెరికాలో మీ ఉత్పత్తులను ప్రారంభించండి. ఇకపై కొత్త ప్రణాళికలు రచించండి’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

More Telugu News