Uttam Kumar Reddy: అంట్లు తోమాను నిజమే.. మీలా దోచుకున్న డబ్బును కారుతో సహా తగలబెట్టలేదు!: ఉత్తమ్ పై కేటీఆర్ ఫైర్

  • ఉత్తమ్ వ్యాఖ్యలపై మంత్రి కౌంటర్
  • అమెరికాలో ఇళ్లలో అందరూ ప్లేట్లు కడుగుతారు
  • నేను గౌరవప్రదంగా సంపాదించుకుని బతికాను

అమెరికాలో అంట్లు తోమిన కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) రాజకీయాల గురించి తమకు చెప్పకూడదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో సగటు భారతీయుడిలా తాను ఉద్యోగం చేసి సంపాదించి గౌరవంగా బతికాననీ, దీనికి గర్వపడుతున్నానని తెలిపారు. పప్పూలా (రాహుల్ గాంధీ) తానేమీ ప్రజా ధనాన్ని దోచేయలేదని విమర్శించారు. అలాగే దోచుకున్న ప్రజాధనాన్ని మీలా కారుతో సహా కాల్చేయలేదని ఉత్తమ్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్ లో స్పందించారు.

‘ప్రియమైన ఉత్తమ్ కుమార్ గారూ.. నేను అమెరికాలోని నా ఇంట్లో అంట్లు తోమి ఉండవచ్చు (అమెరికాలోని చాలామంది భారతీయులు తమ ఇళ్లలో ఇదే చేస్తారు). నేను అమెరికాలో ఉద్యోగం చేస్తూ గౌరవప్రదంగా సంపాదించుకుంటూ బతికాను. దీని పట్ల నేను గర్వపడుతున్నా. అంతేకానీ మీ నాయకుడు పప్పూలాగా ప్రజా ధనాన్ని లూటీ చేయడమో, మీలాగా దోచుకున్న ప్రజల డబ్బును కారుతో సహా తగలబెట్టడమో చేయలేదు’ అని ట్విట్టర్ లో కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ కు రెండు పేపర్ కటింగ్ లను కూడా మంత్రి జతచేశారు.

More Telugu News