11ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో యువకుడికి మరణశిక్ష!

  • సరైన సాక్ష్యాలు లేకపోవడంతో తప్పించుకున్న ఐదుగురు
  • మరో ఇద్దరిని జువైనల్ హోంకు పంపిన కోర్టు
  • కోర్టు తీర్పుపై సర్వత్ర హర్షం
పదకొండేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హత్య చేసిన 19 ఏళ్ల యువకుడికి కోర్టు మరణశిక్ష విధించింది. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే..  నాగోన్ జిల్లాలోని ధనియాభేటి లాలుంగ్ గావ్‌కు చెందిన బాలికపై ఈ ఏడాది మార్చి 23న  జకీర్ హుస్సేన్ మరికొందరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం బాలికను సజీవ దహనం చేశాడు. ఏప్రిల్ 28న పోలీసులు ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేశారు. జకీర్‌తో పాటు పోలీసులు మరో ఏడుగురిని అరెస్ట్ చేయగా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఐదుగురు బయటపడ్డారు. మిగతా వారిలో ఇద్దరు బాలురు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించారు.

కేసును విచారించిన కోర్టు సెప్టెంబరు 4న జకీర్ హుస్సేన్‌ను దోషిగా తేల్చింది. శుక్రవారం తుది తీర్పు చెబుతూ జకీర్‌కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలికల హక్కుల కోసం పోరాడుతున్న పలు సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.
Go Back to Shorts
Death penalty
raped
murder
minor
GUWAHATI
Assam

More Telugu News