TRS: కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు.. అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ‘తీగల’ను ఓడిస్తా!: కొత్త మనోహర్

  • పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
  • తీగల తెలంగాణ ద్రోహి అన్న మనోహర్
  • భారీ మెజారిటీతో గెలుస్తానని వెల్లడి

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వీరిలో కొందరేమో పార్టీ అధిష్ఠానంపై లోలోన రగిలిపోతుంటే, మరికొందరేమో బాహాటంగానే తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.

తాజాగా మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ను కేసీఆర్ తీగల కృష్ణారెడ్డికి ఇవ్వడంపై కొత్త మనోహర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన మనోహర్ రెడ్డి ఓడిపోగా, టీడీపీ టికెట్ పై పోటీచేసిన తీగల కృష్ణారెడ్డి విజయం సాధించారు. అనంతరం కృష్ణారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా ఈ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం కృష్ణారెడ్డికి టికెట్ కన్ఫామ్ చేయడంపై కొత్త మనోహర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

తీగల కృష్ణారెడ్డి తెలంగాణ ద్రోహి అనీ, టీఆర్ఎస్ లోకి వచ్చి తన రాజకీయ భవిష్యత్ ను నాశనం చేశాడని మనోహర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కృష్ణారెడ్డిని ఓడించడమే తన లక్ష్యమనీ, ఇందుకోసం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. మహేశ్వరంలో ఇంటిపెండెంట్ గా పోటీచేసి భారీ మెజారిటీతో గెలుస్తాననీ, ఈ సీటును కేసీఆర్ కు బహుమతిగా ఇస్తానని మనోహర్ రెడ్డి వెల్లడించారు.

More Telugu News