kcr: కాంగ్రెస్ దద్దమ్మలు అవాకులు, చవాకులు పేలుతున్నారు: కేసీఆర్

  • రాష్ట్ర  అభివృద్ధిపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి
  • ప్రధాని మోదీ సైతం మన సంక్షేమ పథకాలను అభినందించారు
  • ఏ రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపుల్లో లేదు

టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ సహా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొనియాడారని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అనేక త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని... రాష్ట్ర అభివృద్ధిపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయని తెలిపారు. కానీ, ప్రతిపక్షాల కాకిగోల మాత్రం చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. విపక్ష నేతలు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ఏ రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదని చెప్పారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ దద్దమ్మలు, విపక్షాలకు చెందిన నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇంత ప్రగతిని సాధించే క్రమంలో తనకు సహకరించిన తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. 

More Telugu News