Pakistan: పండిట్ నెహ్రూ వ్యక్తిగత డెంటిస్ట్ కుమారుడు.. పాకిస్తాన్ నూతన అధ్యక్షుడు!

  • పాక్ అధ్యక్షుడిగా డా. ఆరీఫ్ అల్వీ
  • సైనిక పాలన సందర్భంగా బుల్లెట్ గాయాలు
  • అలీ కుటుంబంతో నెహ్రూకు అనుబంధం

పాకిస్తాన్ 13వ అధ్యక్షుడిగా డా. ఆరీఫ్ అల్వీ(69) నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆరీఫ్ అల్వీకి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని అధికార పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) తమ వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. అల్వీ కుటుంబం దేశ విభజనకు ముందు ఢిల్లీలో ఉండేదని వెల్లడించింది. అల్వీ తండ్రికి, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మంచి సంబంధాలు ఉండేవని పేర్కొంది.

డా. అల్వీ తండ్రి డా.హబీబుర్ రెహ్మాన్ పండిట్ నెహ్రూకు వ్యక్తిగత డెంటిస్ట్ గా పనిచేసేవారని పీటీఐ తమ వెబ్ సైట్ లో తెలిపింది. దేశవిభజన తర్వాత అల్వీ కుటుంబం పాకిస్తాన్ లోని కరాచీకి వచ్చేసిందని వెల్లడించింది. స్వాతంత్ర్యం తరువాత డా.హబీబుర్ యోగక్షేమాలు కోరుతూ నెహ్రూ లేఖలు రాసేవారనీ, అవి ఇప్పటికీ ఆ కుటుంబం వద్ద భద్రంగా ఉన్నాయని పార్టీ తమ వెబ్ సైట్ లో చెప్పింది. కేవలం అల్వీనే కాదు.. పాక్ గత అధ్యక్షులు పర్వేజ్ ముషార్రఫ్, మమ్నుూన్ హుస్సేన్ ఇద్దరూ భారత్ నుంచి పాక్ కు వలసవెళ్లిన వారే!

డా.హబీబుర్ పాక్ లోని కరాచీకి వలసరాగా, 1949లో డా.అల్వీ జన్మించారు. తండ్రి అడుగుజాడలోనే ఆయన దంత వైద్యుడిగా స్థిరపడ్డారు. జమాతే ఇస్లామీ హింద్ సంస్థలో చేరిన ఆయన సైనిక నియంత ఆయూబ్ ఖాన్ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొని బుల్లెట్ దెబ్బలు కూడా తిన్నారు. చివరికి 1996లో ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీలో చేరారు. పార్టీలో క్రమక్రమంగా ఎదుగుతూ ఇప్పుడు ఏకంగా పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

More Telugu News