Samsung: తొలి ఎల్ఈడీ సినిమా థియేటర్ మొదలైపోయింది!

  • సినిమా థియేటర్ లకు వచ్చేసిన ఎల్ఈడీ టెక్నాలజీ
  • న్యూఢిల్లీలోని పీవీఆర్ మల్టీప్లెక్స్ లో ప్రారంభం
  • రూ. 7 కోట్లు ఖర్చు చేసిన థియేటర్

ఇప్పటి వరకూ టెలివిజన్ రంగానికే పరిమితమైన ఎల్‌ఈడీ టెక్నాలజీ, సినిమా థియేటర్ లకు వచ్చేసింది. దీంతో సినిమా థియేటర్లలో మరింత ప్రకాశవంతమైన చిత్రాన్ని కళ్లకు ఇబ్బంది లేకుండా చూసే వీలు కలుగుతుంది. ఇండియాలో తొలి ఎల్ఈడీ థియేటర్, న్యూఢిల్లీలోని పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌ లో ప్రారంభమైంది. శాంసంగ్‌ సంస్థ సహకారంతో ఈ స్క్రీన్ ఏర్పాటైంది. మరింత స్పష్టమైన చిత్రంతో పాటు ధ్వని కూడా అద్భుతంగా ఉంటుందని పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ బిజ్లి చెప్పారు.

కాగా, ఎల్‌ఈడీ తెరకు ప్రొజెక్టర్‌ అవసరం ఉండదు. సాధారణ థియేటర్లలో సినిమా నడుస్తుంటే, లైట్లు ఆర్పివేస్తారన్న సంగతి తెలిసిందే. ఎల్ఈడీ థియేటర్ లో లైట్లు వెలుగుతూ ఉన్నా సినిమా చూసేందుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఈ స్క్రీన్ ఏర్పాటుకు రూ. 7 కోట్లు ఖర్చు అయిందని, ప్రపంచంలో ఇప్పటివరకూ 12 థియేటర్లలో ఈ తరహా ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశామని శాంసంగ్ వెల్లడించింది.

More Telugu News