Harikrishna: కొద్దిగా మా సంగతి కూడా పట్టించుకోండి: హరికృష్ణ కారు ప్రమాదంలో గాయపడిన యువకులు

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకులు
  • కెమెరాలు ధ్వంసమయ్యాయని ఆవేదన
  • ఆదుకోవాలంటూ వేడుకోలు

నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి వద్ద నందమూరి హరికృష్ణ కారు ప్రమాదానికి గురైన సమయంలో, ఆ వైపు నుంచి వస్తున్న మరో కారును ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువ ఫొటోగ్రాఫర్లు గాయపడ్డారు. వీరు కూడా హరికృష్ణ చికిత్స పొందిన ఆసుపత్రిలోనే చికిత్స అందుకుంటున్నారు. అయితే, దురదృష్టవశాత్తు హరికృష్ణ మృతి చెందడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. వీరి గురించి పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. ప్రమాదం జరిగిన రోజు ఆసుపత్రికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వీరిని కూడా పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

తాజాగా, ఈ యువకులు మాట్లాడుతూ.. తీవ్రంగా గాయపడిన తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చాలా పేదలమని, వైద్య ఖర్చులు కూడా భరించే శక్తి తమకు లేదని వాపోయారు. ప్రమాదంలో విలువైన కెమెరాలు ధ్వంసమయ్యాయని, తమ జీవనానికి అవే ఆధారమని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తమ విషయంలో నందమూరి కుటుంబ సభ్యులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

More Telugu News