రుణమాఫీ కాలేదని ప్రాణం తీసుకున్న రైతు దంపతులు!

  • కర్నూలు జిల్లాలో దారుణం
  • నోటీసులు పంపిన బ్యాంకు అధికారులు
  • పురుగుల మందు తాగిన రైతన్న కుటుంబం
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామనీ, వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు గాలి మూటలుగానే మిగులుతున్నాయి. ఓవైపు పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, మరోవైపు చేసిన అప్పు తీరకపోవడంతో చాలామంది రైతులు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. తాజాగా రుణమాఫీ కాకపోవడంతో పాటు ఆ రుణాన్ని చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసు జారీచేయడంతో మనస్తాపం చెందిన ఓ రైతు తన భార్యతో కలసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.


కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడు గ్రామంలో ఉన్న రామయ్య వ్యవసాయం కోసం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి రూ.1.46 లక్షల రుణం తీసుకున్నారు. 2016లో రుణ విమోచన పత్రాన్ని కూడా బ్యాంకు అధికారులు రామయ్య దంపతులకు అందించారు. కానీ రుణమాఫీ డబ్బులు రామయ్య బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ కాలేదు. దీనికితోడు వేసిన పంట కూడా దెబ్బతింది.

ఈ నేపథ్యంలో లోన్ ను వెంటనే చెల్లించాలని బ్యాంకు అధికారులు రామయ్యకు నోటీసులు జారీచేశారు. దీంతో అసలే ఆర్థికంగా చితికిపోయిన రామయ్య దంపతులు మరో మార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
LOAN WAIVER
FARMER
SUICIDE
Kurnool District

More Telugu News