Drunk Driving: డ్రంకెన్ డ్రైవ్ వివాదం... తాగలేదంటున్న యువకుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మనవడే!

  • తాను తప్పు చేయలేదని చెబుతున్న జహీరుద్దీన్
  • తప్పు ఎక్కడ జరిగిందో తేల్చే పనిలో పోలీసులు
  • క్షమాపణలు చెప్పి, వాహనం ఇవ్వాలంటున్న జహీరుద్దీన్

తాను తాగలేదని ఎంత చెప్పినా వినకుండా వాహనం స్వాధీనం చేసుకున్నారని చెబుతూ, హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులపై కేసు పెట్టిన యువకుడు జహీరుద్దీన్‌, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మనవడని తేలడంతో పోలీసులు ఈ కేసు పర్యవసానాలు ఎలా ఉంటాయోనని మధనపడుతున్నారు. తమ వద్ద ఉన్న బ్రీత్ అనలైజర్ లో ఓ రకమైన ఫలితం, ఆపై ఉస్మానియా వైద్యుల రిపోర్టు మరో రకంగా ఉండటంతో తప్పు ఎక్కడ జరిగిందో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

తాను కౌన్సెలింగ్ కు వెళ్లబోనని, పోలీసులే తనకు క్షమాపణలు చెప్పి, తన కారును ఇచ్చి వెళ్లాలని జహీరుద్దీన్‌ డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఉస్మానియా వైద్యులు రక్త నమూనాలు సేకరించకుండా మద్యం తాగలేదని నివేదిక ఇచ్చారని పోలీసులు ఆరోపిస్తుండటం గమనార్హం. కేవలం కళ్లు చూసి రిపోర్టు ఇచ్చారని చెప్పిన సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శంకర్ రాజు, తాము పకడ్బందీగా, ఎలాంటి తప్పులు జరుగకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

More Telugu News