Hyderabad: హైదరాబాద్ లో ప్రభాస్ ఫైట్.. రంగంలోకి హాలీవుడ్ నిపుణులు!

  • రామోజీ ఫిలిం సిటీలో సాగుతున్న షూటింగ్
  • 90 శాతం రియల్ ఫైట్లే అంటున్న చిత్ర యూనిట్
  • దుబాయ్ లో ఛేజింగ్ సీన్లకే రూ.90 కోట్ల ఖర్చు

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో సాహో చిత్రాన్ని సుజిత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఫైట్ సన్నివేశాలను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సీటీలో చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో ప్రభాస్, ఇతర నటులపై యాక్షన్ సీన్లను షూట్ చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశాన్ని చిత్ర యూనిట్ బయటపెట్టింది. సాహోలో 90 శాతం రియల్ గా సాగే పోరాట ఘట్టాలే ఉంటాయట. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దుబాయ్ లో జరిగిన సాహో షూటింగ్ లో ఛేజింగ్ సన్నివేశాల కోసం ఏకంగా రూ.90 కోట్లు ఖర్చు పెట్టినట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లీన్ శర్మ, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

More Telugu News