India: కేంద్రం ఆశలపై నీళ్లు.. ‘జమిలి’ ప్రశ్నే లేదని తేల్చేసిన ఎన్నికల సంఘం!

  • జమిలి ఎన్నికలు సాధ్యం కాదు
  • లోక్‌సభకు ముందస్తూ లేదు
  • స్పష్టం చేసిన సీఈసీ రావత్

లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న కేంద్రం ఆశలపై కేంద్ర ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. జమిలి ఎన్నికలు నిర్వహించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. అంతేకాదు, ముందస్తు ఎన్నికలకు కూడా అవకాశం లేదని తేల్చి చెప్పారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు అవసరమని పేర్కొన్న రావత్ అందుకు లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాలని పేర్కొన్నారు. ఒకవేళ సవరణలకు అంగీకరిస్తే అందుకు చట్ట సభ్యులు కనీసం ఏడాది సమయం తీసుకుంటారని, కాబట్టి ప్రస్తుతానికి జమిలికి వెళ్లే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సాధారణంగా 14 నెలల ముందుగానే కార్యాచరణ ప్రారంభిస్తామని రావత్ పేర్కొన్నారు. తమ వద్ద 400 మంది సిబ్బందే ఉన్నారని, అయితే, ఎన్నికల నిర్వహణకు మాత్రం కోటిమందికిపైగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల విషయానికి వస్తే అదంత ఆషామాషీ కాదన్నారు. సిబ్బంది, భద్రత, ఈవీఎంలు, వీవీపాట్‌ తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని.. అదంతా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని తేల్చి చెప్పారు.

More Telugu News