Warangal: తాను అనుభవించిన బాధను భర్తకు తెలిసేలా చేసి.. చిత్రహింసలు పెట్టి చంపేసిన భార్య!

  • మహబూబాబాద్ జిల్లాలో ఘటన
  • భర్తకు మద్యం తాగించి కరెంట్ షాక్ పెట్టి చిత్ర హింసలు
  • దయ్యమై వస్తాడని క్షుద్రపూజలు

భర్త పెట్టే చిత్ర హింసలను భరించలేని ఓ ఇల్లాలు.. ఇన్నాళ్లు తాను అనుభవించిన బాధను అతడికి తెలిసేలా చేసి అత్యంత దారుణంగా హత్యచేసిందో ఇల్లాలు. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి హత్యను చూసి పోలీసులు సైతం ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో జరిగిన ఈ ఘటన పెను సంచలనమైంది. ఈ నెల 8న ఈ హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసుల కథనం ప్రకారం..

గుగులోతు సరిత (35), సురేశ్ (40) భార్యాభర్తలు. పదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలున్నారు. తాగుడుకు బానిసగా మారిన సురేశ్.. భార్య కూలి పనులకు వెళ్లి సంపాదించి తెచ్చిన డబ్బులను లాక్కుని మద్యం తాగి ఇంటికొచ్చేవాడు. నిత్యం ఆమెను వేధించేవాడు. ఈ విషయంలో పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ సురేశ్ మారకపోగా, చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి.

దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 8న మాట్లాడే పని ఉందంటూ తన బంధువులైన ఇద్దరు వ్యక్తులను ఇంటికి పిలిపించింది. తర్వాత ముగ్గురూ కలిసి సురేశ్‌ను వస్రాతండాకు తీసుకెళ్లారు. అతడికి పీకల వరకు మద్యం తాగించారు. అనంతరం సురేశ్‌ను తాళ్లతో బంధించి కరెంట్ షాకిచ్చారు. వారి బారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా బండరాయితో అతడి తలపై మోది హత్యచేశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక తండా శివారులో ఉన్న పాశంబోడు గుట్టపైకి తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చాలని నిర్ణయించారు.

అయితే వారిలో ఓ భయం పట్టుకుంది. అతడు దయ్యమై తిరిగి వచ్చి తమను ఎక్కడ హింసిస్తాడోనని అక్కడే క్షుద్రపూజలు చేశారు. దహనానికి ముందు అతడి కళ్లలో సూదులు గుచ్చారు. అనంతరం గిరిజన సంప్రదాయం ప్రకారం దహనం చేసి ఆ ప్రాంతం చుట్టూ నువ్వులు పోశారు. ఇటీవల ఆ ప్రాంతానికి గొర్రెలు మేపుకుంటూ వెళ్లిన కాపర్లు అక్కడ ఓ వ్యక్తిని దహనం చేసిన ఆనవాళ్లను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు లాలితండాకు చెందిన సురేశ్ అదృశ్యమైనట్టు తెలిసింది. అతడి భార్య సరితను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఘోరం వెలుగుచూసింది. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News